14, ఏప్రిల్ 2021, బుధవారం

ఒక ప్రేమ కథ


అక్కడికి దూరంగా ఒక చిన్న పల్లెటూరు. పల్లెకు వెళ్ళాలంటే, దారి ఎద్దుల బండిలో. బస్ స్టాఫ్ కి ఇరవై అయిదు మైళ్ళ దూరం ఒక పల్లె. ఆ పల్లెలో వారి తాత గారైన కృష్ణమూర్తి పంతులు గారి ఇంటికి బయల్దేరుతున్నాడు మోహన్, దాదాపు పది సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చాక, ఇన్నాళ్ళూ హాస్టల్లో ఉండటంతో వారి స్వంత ఊరు అయినప్పటికీ రావటానికి కుదరలేదు. ఆ ఉదయం ఆదివారం, మర్నాడు, ఆ మర్నాడు సెలవులు కావడంతో, ఆలస్యంగా నిద్ర లేచినప్పటికీ, పనులన్నీ చకచకా చేసుకుని మధ్యాహ్నం దొరికే నిద్రను త్యాగం చేసి, ఆరు గంటల బస్సు ప్రయాణం తదనంతరం రెండు గంటల ఎద్దుల బండి ప్రయాణం చేసి ఎట్టకేలకు, మోహన్ సాయంకాలం ఏడు గంటలకి తాత గారి ఇల్లు చేరుకున్నాడు.

పంతులు గారు ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు క్రింద నులక మంచం పై కూర్చొని చుట్ట కాలుస్తున్నారు, చుట్టూ మరో నలుగురు ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ కాలక్షేపము చేస్తూ ఉన్నారు.

మనవణ్ణి అల్లంత దూరం నుండి చూస్తూనే, "ఎవరూ?" అని కళ్ళజోడు సవరించుకుంటూ, నెమ్మదిగా చేతి కర్ర సాయంతో లేచి పలకరించారు కృష్ణమూర్తి పంతులుగారు. ఒరే ఒరే ఒరే! నువ్వేనారా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! అని మనవణ్ణి గట్టిగా హత్తుకున్నారు.

తాతయ్యా ఆగండి ఊపిరందట్లేదు అని నెమ్మదిగా విడిపించుకుని, కాళ్ళకు దండం పెట్టాడు మోహన్. ఫరవాలేదు, మన పద్ధతులు మరచి పోలేదు అనుకుని, ఇక వెళ్ళొస్తామని బయలుదేరారు గ్రామ పెద్దలు.

పదరా, ఇంట్లో అత్తయ్యా వాళ్ళున్నారు, అని ఇంట్లోకి తీసుకెడుతూ, "ఏవోయ్, ఎవరొచ్చారో చూసావా" అంటూ బామ్మని కేకేసాడు.

"ఆ ఆ వచ్చె వచ్చే అంటూ లోపలనుండి చేతులు తుడుచుకుంటూ, బామ్మగారు వచ్చారు.

'కళ్ళు ఆలిచిప్పలంత వేసుకుని చూస్తావా, మనవడి తో ఏమైనా పలకరించేదుందా' అంటున్న తాత గారికి చిరునవ్వే జవాబుగా ఇస్తూ, ‘ఒరే, ఎప్పుడొచ్చావురా, రా పెరట్లో కాళ్ళు కడుక్కురా అని లోపలకు దారి చూపించింది.

మోహన్ చాలా ఆనందంగా, బామ్మా, ఎలా ఉన్నావు అంటూ దగ్గరగా వచ్చి అక్కున చేరాడు.

బానే ఉన్నానురా అనికబుర్లకేం కానీ, లోపలకి పదండి ఏవేళప్పుడు తిన్నాడో ఏమొ అని భోజనాలగది వైపు దారి తీసింది.

బాసిం పట్టు వేసుక్కూచుని, ఔపోశన ఇచ్చి భోజనానికి ఉపక్రమిస్తూ అడిగారు తాత గారు, "ఆ చెప్పరా, ఏమిటి విశేషాలు" అని, తెల్లని అన్నం చిన్ని మెతుకులు ముందుగా నోట్లోవేసుకుంటూ.

"ఏముంది తాతయ్యా, ఇప్పటి వరకు సెమెస్టర్ పరీక్షలు అయిపోయాయి, రెండు రోజులు సెలవ రావడంతో మిమ్మల్ని చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు.

'ఔనవును, తెలిసింది, ఆలస్యంగా అయినా సీట్ దొరికిన వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యావని రాసాడు మీ నాన్న.' అన్నారు తాతగారు.

బామ్మ గారు వడ్డన చేస్తూ, 'మీ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారా, ఎలా ఉన్నారు?'అంటూ 'ఇంకొంచెం వేసుకోరా, ఈ రొజు అరటి దూట కూరా’ అంటూ మరో గరిటెడు వడ్డించింది.

"బాబొయ్, బామ్మా చాలు చాలు’ అంటున్నా కొసరి కొసరి మాగాయ పెరుగు వడ్డించింది ఆవిడ.

’ఒరేయ్ మోహనూ, ఇదుగో కందిపచ్చడి వేసుకో పెరుగులోకి”, బాగుంటుంది అని వాళ్ళ పెద్దత్త మరి కాస్త వడ్డించింది.

హాస్టల్ నిద్రా, మెస్సు భొజనానికి అలవాటైన మోహన్ కి కొంచెం భుక్తాయాసం వచ్చినట్లు గానే ఉంది.

మర్నాడు ఉదయమే లేచి తాతయ్య తో బాటు పొలానికి వెళ్ళి, అక్కడ నీళ్ళు పెడుతున్న పాలేరులు వాళ్ళతో మాట్లాడి, చెరువులో ఈత కొట్టి బయల్దేరారు, దారిలో పాలేరు వాళ్ళ అమ్మాయి ఇచ్చిన వేరుసెనక్కాయలు నముల్తూ.

కాత్యాయని పద్దెనిదేళ్ళు ఉంటుందేమో తండ్రికి సహాయం చేస్తూన్నా, ఆమె కూడా సెలవులకి వచ్చింది. చదువుకునే వేళకు వెళ్ళిపోతుంది, రెండు నగరాలు పక్క పక్కనే, కావడంతో ఆమె కూడా మర్నాడు డీలక్స్ బస్సులో వెళ్ళిపోతుంది.

పది నిమిషాలు కూడా ఊరుకోకుండా ఒకటే గలగలా మాట్లాడుతంటే, అవాక్కయి అలాగే చూస్తూ ఉండిపోయాడు...

వారినే గమనిస్తున్న తాతయ్య గారి మదిలో జ్ఞాపకాల వరవడి...

****                                               ***                                      ****

శ్రీధర్ ఎం డి చేసిన వెంటనే,ఫెలోషిప్ కి బయల్దేరాడు. పది రోజుల ముందుగానే ప్రసూన అని వాళ్ళ కొలీగ్ తో రిజిష్టర్ మేరేజీ చేసుకున్నాడు. మామగారు ఎన్ ఆర్ ఐ కావడంతో, పెళ్ళవగానే ఇద్దరూ బయల్దేరారు, సీమ చదువులకు.

వాడు పెళ్ళి చేసుకోవడం పెద్ద చదువులకు వెళ్ళడం ఇష్టమే అయినా, ఎలా మాట కూడా చెప్పకుండా పెళ్ళిచేసుకున్నారు కదా, అందరూ ఉన్నప్పటికీ అనిపించింది.

'ఏం చేయగలం నాన్నా, ఆగష్టు లోనే ఫెలోషిప్ ఆరంభం కానుంది, ఇద్దరికీ పెళ్ళయింది అని చూపించాలి వీసా కు వెంటనే, అప్ప్లై చేసాక పదహేను రోజులదాకా రాదు కదా, అందుకే వెంటనే చేసుకోవాల్సి వచ్చింది నాన్నా' అని కొడుకు అంటుంటే నవ్వుతూనే ఆశీర్వదించారు, అయినా, చూడలేకపోయామే అని మనసులో ఎప్పుడో కలుక్కు మంటుంది.

 

ఆ తరవాత కొన్నాళ్ళ పాటు వెనక్కొచ్చారు. పిల్లాడి ఎనిమిదో సంవత్సరం దాకా ఉండి మళ్ళీ వెనక్కెళ్ళారు, వాళ్ళ నాన్న గారికి సహాయం గా ఉండాలని, వాళ్ళ ప్రయివేటు ఆసుపత్రిలో వీళ్ళ సహాయం కావాలి అన్నారు. అప్పుడే ఇదుగో, ముఖ్యంగా ఏదో మహమ్మారి లాటి ఎపిడెమిక్ రావడంతో వెళ్ళాల్సి వచ్చింది. ఆ తరవాత ఇదుగో ఇప్పుడే మనవడు మళ్ళీ ఎన్ ఆర్ ఐ కాలేజీలో సీట్ తెచ్చుకుని వచ్చాడు ఇన్నాళ్ళకి.

***                                                  ***                                                  ***

చూడండి తాతయ్యా, ఎలా మాట్లాడూతోందో, కాత్యా..' అంటూన్న మనవడి మాటలకు, ఊహల్లోంచి బయటపడ్డారు పంతులు గారు.

ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తున్న తాత గారికి కంప్లేను చేస్తున్న మనవడు, చూడండి తాతయ్యా నేను ఇదే ఊళ్ళో ప్రాక్టీసు చెయ్యలేనంటుంది కాత్యాయని, ఎందుకు చెయ్యలేను తాతయ్యా, నాకూ తెలుగు వచ్చు కదా?’ అనగానే గట్టిగా నవ్వేశారు తాత గారు.

అప్పటిదాకా గంభీరంగా ఉన్న వాతావరణము, మరి మబ్బులో లేక చల్లటి పైరు గాలికో గాని చల్లబడూతుంది. అప్పుడే తలలాడిస్తున్న ఎర్ర గన్నేరు పూలను చూస్తూ, "మరి ఛాలెంజ్ తీసుకోవోయ్, ధైర్యం ఉంటే!' అనేసి నవ్వారు, తాతయ్యగారు.

అక్కడ గడిపిన రెండు రోజుల్లో, పొలానికి వెళ్లి రావడం, పాలేరులతో మాట్లాడటం, చెరువులో ఈత కొట్టి రావడం, వీటితో అసలు సమయమే తెలియ లేదు. అన్నింటికన్నా కాత్యాయని తో పరిచయం, మలయ మారుతం లా ఉంది! మోహన్ మనసులో ఏవో మధురోహలతో గుండె లోతులలో నల్లని వరవడో మరేదో మాటలకందని భావన,ఐఫొన్ లో నుండి 'మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై' అని పాట వస్తూ ఉంది!

ఇహ బామ్మ గారి ఆనందాన్ని అంచనా వేయద్దు! ఆమె ఆదరణ వంటలు అడగనే వద్దు. 'ఏవోయ్, అస్థమాన్లూ నడుం పట్టేసిందీ ఈరోజు కాదు, రేపూ అని అనే దానివి ఇవ్వాళ్ళేంటోయ్, చకచక గరిట తిప్పేస్తున్నవే? అన్నా, విసుక్కోకుండా, నవ్వుతూనే ఉంది, 'ఇన్నాళ్ళకైనా తిరుగుతున్నాను కదా, నాకు పిల్లలను చూస్తే ప్రాణం. అది వాళ్ళే ఇస్తారని తెలుసు కదా' అంటూ, అత్యంత శీతలమైన చిరునవ్వులతో, తమలపాకు చిలకలు అందిస్తుంది..

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి